Mamata Banerjee : దేశంలో అతిపెద్ద చొరబాటుదారుడు ప్రధాని మోదీయే అని విమర్శించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్లో శనివారం జరిగిన ఈద్ ర్యాలీలో మమత పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీపై, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో అతిపెద్ద చొరబాటుదారుడు మోదీ. బెంగాల్ను ఎవరు లక్ష్యంగా చేసుకుంటారో వారు నరకానికి వెళ్తారు.
బీజేపీని రాష్ట్రంలోకి రాకుండా చూస్తాం. మోదీ నుంచి, బీజేపీ నుంచి దేశాన్ని, బెంగాల్ను కాపాడటమే టీఎంసీ ప్రాథమిక కర్తవ్యం. బెంగాల్ మత సామరస్యాన్ని కాపాడుతాం. సర్ ద్వారా ప్రజల ఓటు హక్కుల్ని కాలరాసింది బీజేపీ. సర్కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. బీజేపీ అంటే గూండాలు, దొంగల పార్టీ. మీ ఓటు హక్కును మోదీ తీసుకోకుండా చూస్తా. ప్రజాస్వామ్యాన్ని, ప్రతి పౌరుడి హక్కుల్ని కాపాడేందుకు పోరాడుదాం. కొందరు ప్రజల ఓట్లు సర్ పేరుతో తీసేశారు. నేను దీనికోసం కోల్కతా నుంచి ఢిల్లీ వరకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లా. ప్రజల హక్కులకు రక్షణ దొరుకుతుందనుకుంటున్నా. బెంగాల్లోని అన్ని కులాలు, వర్గాల ప్రజలకు అండగా ఉంటా’’ అని మమత వ్యాఖ్యానించారు. అయితే, మమత వ్యాఖ్యలపై బెంగాల్ బీజేపీ నేతలు మండిపడ్డారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశ, భయంతో మమత ఇలా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ నేత శిశిర్ బజోరియా అన్నారు. మమత ఉపయోగించిన భాష సరికాదన్నారు. ప్రధాని మోదీని చొరబాటుదారుడు అని ఎవరు అన్నా వారికి రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఇక, బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడుతాయి.