కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా శాసనసభలో గురువారం ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమెతోపాటు అమీరుల్ ఇస్లాం, జాకీర్ హుస్సేన్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్కు బదులుగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ వీరితో ప్రమాణం చేయించారు. తద్వారా బెంగాల్లో కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టారు.
కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 58,835 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. మమతకు 85,263 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్కు 26,428 ఓట్లు పడ్డాయి.
మరోవైపు బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. జంగీపూర్లో టీఎంసీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ 92,480 ఓట్ల మెజారిటీతో, షంషేర్గంజ్లో అమీరుల్ ఇస్లామ్ 26,379 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.