కోల్కతా: హెలికాప్టర్ ప్రమాదం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్రుటిలో తప్పించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తీవ్రమైన కుదుపులకు లోనవ్వటంతో, సిలిగురికి సమీపంలో ఆర్మీకి చెందిన ఎయిర్బేస్ వద్ద అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో సీఎం స్వల్పంగా గాయపడ్డారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కోల్కతాకు చేరుకున్న తర్వాత ఆమె దవాఖానలో చేరారు. డార్జిలింగ్ జిల్లా జల్పాయిగురిలో పంచాయతీ ఎన్నికల సభలో పాల్గొన్న మమతా బెనర్జీ, తిరిగి హెలికాప్టర్లో బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుంతాపూర్ అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుండగా భారీ వర్షం, భీకరమైన గాలుల తాకిడికి హెలికాప్టర్ తీవ్రమైన కుదుపులకు లోనవడంతో అత్యవసర ల్యాండింగ్కు నిర్ణయించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేది మరో ఆరు నెలలు మాత్రమేనని, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. జల్పాయ్గురి జిల్లాలో మంగళవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని బీజేపీ ముందే పసిగట్టిందని, అందుకే వివిధ గ్రూపులు, కమ్యూనిటీలను మభ్యపెట్టేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు.