కోల్కతా: బంగ్లాదేశ్ మీదుగా అంతర్జాతీయ సరిహద్దు వద్ద పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా మాణిక్ చాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెరబడిన చైనీయుడిని సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) జవాన్లు అరెస్ట్ చేశారు. సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా కస్టడీలోకి తీసుకున్నట్లు గురువారం బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.
అతడి వద్ద ఒక లాప్టాప్ ఉందని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ వీసాలతోపాటు చైనా పాస్పోర్టు కూడా ఉన్నాయన్నారు. ప్రాథమిక దర్యాప్తు చేశాక మాణిక్చాక్ పోలీస్ స్టేషన్లో అప్పగించామని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు అరెస్ట్ చేసిన చైనీయుడి పేరు హోన్జూన్ (36) అని తేలింది. ప్రస్తుతం మాణిక్ చాక్ పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు.
భారత్లోకి ఎందుకు ప్రవేశించాడని కేంద్ర దర్యాప్తు సంస్థలు అతడ్ని ప్రశ్నిస్తున్నాయి. సున్నితమైన సమాచారం సేకరించడానికి వచ్చి ఉండక పోవచ్చునని భావిస్తున్నాయి. కానీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి.
ఒకవైపు భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా ఆ వ్యక్తి తారసపడటం గమనార్హం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనీయుడు అరెస్ట్పై సందేహాల నీలి నీడలు కమ్ముకున్నాయి.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనీయుడు పట్టుబడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. గురువారం ఉదయం 6 గంటలకు అనుమానాస్పదంగా కనిపించడంతో జవాన్లు అతడ్ని ప్రశ్నించారు. సంత్రుప్తికర సమాధానాలివ్వకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు, స్థానిక పోలీసులకు అప్పగించారు.