MLA warning | బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్టాల్లో మాదిరిగానే మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యవహరిస్తున్నది. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పోలీసులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేలా భయపెడుతున్నది. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా పోలీస్ స్టేషన్నే కాలబెడతామని తీవ్రంగా హెచ్చరించారు. తమ మాటే వినాలని బీజేపీ నేతలు పోలీసులకు హుకూం జారీ చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని బంగావ్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే స్వపన్ మజుందార్ పోలీస్ స్టేషన్కు నిప్పు పెడతానని బెదిరించారు. 24 పరగణాల జిల్లాల్లోని అశోక్నగర్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మజుందార్ మాట్లాడుతూ.. స్థానిక పోలీసులు తమ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. తమ మాటను స్థానిక పోలీసులు వినిపించుకోవడంలేదని, వారు టీఎంసీ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, పోలీస్ స్టేషన్ను తగలబెడతామని బెదిరించడంతో అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో సదరు ఎమ్మెల్యేపై టీఎంసీ ఫిర్యాదు చేసింది. ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి ప్రకటన చేయడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భుర్కుంద పంచాయతీ ఎదుట రూరల్ మండల అధ్యక్షుడు దిలీప్ వైద్యను తృణమూల్ కార్యకర్తలు హత్య చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా నిందితులను అరెస్ట్ చేయలేదని బీజేపీ ఆరోపించింది. ఈ హత్యకు నిరసనగా శనివారం నైహతి రోడ్డు నుంచి బీజేపీ నిరసన ర్యాలీ చేపట్టింది. బీజేపీ నాయకుడి హత్య తర్వాత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్వపన్ మజుందార్.. పోలీసుల సహాయంతో ఇలాంటి ఘటనలు చేసేందుకు టీఎంసీ ధైర్యం వచ్చిందని ఆరోపించారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకుంటే పోలీస్ స్టేషన్ను తగులబెడతామని హెచ్చరించారు.