జవహర్నగర్, జూలై 12: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఆ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జవహర్నగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లు జమాల్పూర్ నవీన్కుమార్, కుతాడి సాయి, బల్లి రోజా, ప్రేమల శ్రీనివాస్ మాట్లాడుతూ… జవహర్నగర్లో గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు. జవహర్నగర్ పట్టణాన్ని మంత్రి మల్లారెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
డివిజన్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరాను. ప్రభుత్వం చేపట్టిన పథకాలతో డివిజన్ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా. అధిక నిధులు ముంజూరు చేయించి సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తాను. -జమీల్పూర్ నవీన్, కార్పొరేటర్, జవహర్నగర్ 25వ డివిజన్
జవహర్నగర్ 3వ డివిజన్ అభివృద్ధికి దూరంగా ఉంది. డివిజన్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యం. కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇక డివిజన్ను మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తా.-బల్లి రోజా, కార్పొరేటర్ (జవహర్నగర్ 3వ డివిజన్ )
ప్రస్తుతం జవహర్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి సీఎం కేసీఆర్, పురపాలక శాఖమంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై టీఆర్ఎస్లో చేరాను. కార్పొరేషన్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం. ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం. -బల్లి శ్రీనివాస్