ముంబై: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తాను గోవా వెళ్తున్నట్లు మీడియాతో అన్నారు. ఎన్సీపీ నేతలు కూడా గోవాకు వస్తున్నారని వెల్లడించారు. అయితే గోవాలో ఎన్సీపీతో కలిసి శివసేన పోటీ చేస్తుందా అన్నది ఆయన స్పష్టం చేయలేదు.
మరోవైపు గోవా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఆప్ గోవాలో అంత బలంగా ఉంటే ఢిల్లీ సీఎం గోవాను పదేపదే ఎందుకు సందర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నా ఆయన గోవాలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కరోనా కేసులు పెరుగుతున్న ఢిల్లీలో ఆయన అవసరం ఎక్కువ కాదా? అని ప్రశ్నించారు. గోవాకు ఆయన ఏం సందేశం ఇస్తారంటూ ఎద్దేవా చేశారు.