షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలున్న అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి 34 మంది ఎమ్మెల్యేల అవసరం ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.
ఈ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున ఎవరు సీఎం కాబోతున్నారనే విషయంలో జోరుగా చర్చ నడుస్తున్నది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరనే విషయంలో పలువురి పేర్లు చర్చకు వస్తున్నాయని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సీఎం ఎంపిక జరుగుతుందన్నారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలం సీఎం ఎంపికపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేల ఎన్నికలో ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడించారని, సీఎం ఎంపికలో తాము నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తాము ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని పార్టీ హైకమాండ్కు తెలుపుతామని, అప్పుడు వారు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని విక్రమాదిత్య పేర్కొన్నారు.