న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు తోలుతారని ప్రధాని మోదీ శుక్రవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)తప్పుపట్టారు. ఇప్పటి వరకు తాము బుల్డోజర్లు వాడలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రియే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం ప్రకారం అన్నింటినీ రక్షిస్తామని, రాజ్యాంగాన్ని ఫాలోఅవుతామని ఆయన అన్నారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. మేం గత 17 నెలల్లో చేసింది, గత 17 ఏళ్లలో ఎవరూ చేయలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తే, వాళ్లు ఎటువంటి సమాధానం ఇవ్వడంలేదన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేశారన్నారు. బీహార్లో విద్యుత్తు చాలా ఖరీదైందని, మేం అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. 10 కేజీల బియ్యం కూడా ఉచితంగా అందివ్వనున్నట్లు చెప్పారు.
ఇండియా కూటమికి మమతా బెనర్జీ సపోర్టు ఇస్తున్న అంశంపై మల్లిఖార్జున్ ఖర్గే స్పందించారు. బయటి నుంచి సపోర్టు ఇస్తామని తొలుత మమత చెప్పిందని, ఇండియా కూటమి ఏర్పడితే అప్పుడు ప్రభుత్వంలో కలుస్తామని ఆమె ఇటీవల పేర్కొన్నట్లు ఖర్గే తెలిపారు. కాబట్టి ఆమె తమతోనే ఉన్నట్లు వెల్లడించారు. మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరీని ఖర్గే తప్పుపట్టారు.