Indian Railway | రాబోయే సంవత్సరాల్లో భారత్లో వెయ్యి నయా జనరేషన్ అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ప్రకటించారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు తయారీ పనులు కొనసాగుతున్నాయన్నారు. వందేభారత్ రైళ్ల ఎగుమతిపై రైల్వేశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో రైల్వేలో చేసిన అభివృద్ధి పనులపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్ వంతెన, కోల్కతా మెట్రో కోసం అండర్ వాటర్ టన్నెల్ను నిర్మించామన్నారు. రైల్వేరంగంలో అనేక సాంకేతిక అభివృద్ధి జరిగిందన్న ఆయన.. రైల్వేకు పెద్ద సామాజిక బాధ్యత ఉందన్నారు.
ఏటా 700 కోట్ల మంది ప్రయాణిలకు గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. ఒక్కో వ్యక్తిని తీసుకువెళ్లేందుకు రూ.100 ఖర్చయితే.. రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేలో ప్రయాణించే ప్రతి వ్యక్తి సగటున 55శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పారు. తాము అమృత్ భారత్ రైలును రూపొందించామన్న ఆయన.. ఇది ప్రపంచస్థాయి సౌకర్యాలున్న రైలని తెలిపారు. కేవలం రూ.454తోనే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చన్నారు. మార్చి 6న కోల్కతాలో నిర్మించిన భారతదేశ తొలి అండర్ రివర్ టన్నెల్ను మోదీ ప్రారంభిస్తారన్నారు. కోల్కతా మెట్రో పనులు 1970లో ప్రారంభం కాగా.. గత పదేళ్లలోనే పురోగతి సాధించినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న దేశానికి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.