manipur| ఇంఫాల్: మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి పౌర సంఘాలు ముందుకు వస్తున్నాయి. అందులో ఫోరం ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ పీస్ ఒక్కటి. ఫోరం కన్వీనర్ అషంగ్ కసర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి సామరస్యం పునరుద్ధరించేందుకు తక్షణమే రెండు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మొదటిది, ముఖ్యమంత్రి బీరేన్సింగ్ను పదవి నుంచి తప్పించడం కాగా… రెండోది, కుకీ, మీతీ తెగల మధ్య ప్రధాని మోదీ శాంతి చర్చలు ప్రారంభించడం అని ఆయన తెలిపారు. ఈ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
మణిపూర్లో పర్యటించి, రెండు తెగల మధ్య సయోధ్య కుదర్చాలని కోరుతూ ఈ నెల 14న ప్రధాని మోదీకి ఫోరం లేఖ రాసింది. అయితే పీఎంవో నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ప్రధాని మోదీ పది రోజుల్లో మణిపూర్ సమస్యకు పరిష్కారం చూపకపోతే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాము ఎలాంటి చర్యకైనా దిగేందుకు వెనుకాడబోమని కసర్ హెచ్చరించారు. ఇది హెచ్చరికలా కనిపిస్తున్నప్పటికీ, ఇందులో ఫోరం ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. శాంతి పునరుద్ధరణకు మోదీ సర్కారు చర్యలు చేపట్టకపోతే మణిపూర్తోపాటు, దేశ రాజధాని ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ది వైర్ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.