ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గమే నిజమైన శివసేన అని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. దీంతో షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థనను తిరస్కరించారు. సుమారు ఏడాదిన్నరగా సాగుతున్న ఎమ్మెల్యేల అనర్హతపై ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పును అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తెలిపారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని ఆరోపించారు. శివసేన చీఫ్ విప్గా సునీల్ ప్రభు నియామకం చెల్లుబాటు అవుతుందని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టును అవమానించారని విమర్శించారు. వారు ( షిండే వర్గమే) నిజమైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన ఆయన, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అన్నారు.
కాగా, షిండే వర్గానికి అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం బీజేపీ కుట్ర అని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ‘బాలాసాహెబ్ ఠాక్రే శివసేనను అంతమొందించాలనేది వారి (బీజేపీ) కల. కానీ ఈ ఒక్క నిర్ణయంతో శివసేన అంతం కాదు. ఎమ్మెల్యేల అనర్హత తీర్పుపై మేం సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని అన్నారు.
మరోవైపు స్పీకర్ రాహుల్ నర్వేకర్ తీర్పు ఆశ్చర్యం కలిగించలేదని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. ‘వహీ హోతా హై జో మంజూర్-ఎ-ఖుదా హోతా హై’ అని తాము విన్నామని తెలిపారు. అయితే 2014 తర్వాత కొత్త సంప్రదాయం ప్రారంభమైందని, ‘వహీ హోతా హై జో మంజూర్-ఇ-నరేంద్ర మోదీ ఔర్ అమిత్ షా హోతా హై’ అని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్నది అదేనన్న ఆమె దురదృష్టకర రాజనీతి అని ఆరోపించారు. చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు దేని గురించి చెప్పిందో అది చట్టబద్ధమైనదిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.