ముంబై: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్నారు. ప్రధాని మోదీ (PM Modi) పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారు. అయితే అసలు సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఎవరీ తెలియదని విమర్శించారు. మహారాష్ట్రలో (Maharashtra) గణేశ్ ఉత్సవాలు ఉన్నాయని, అందువల్ల సమావేశాల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. అయితే లడఖ్ను (Ladakh) చైనా (China) ఆక్రమించడంపై సభలో చర్చ జరపాలని ప్రధాని మోదీ అనుకుంటున్నట్లు తమకు తెలిసిందన్నారు.
లడఖ్, అరుణాచల్ప్రదేశ్లను (Arunachal Pradesh) చైనా తమ భూభాగాలుగా మ్యాప్లో చూపించడం ప్రధాని మోదీని కలచివేస్తే.. దానిపై చర్చడాన్ని తాము స్వాగతిస్తామని చెప్పారు. అదేవిధంగా మణిపూర్ (Manipur) అల్లర్లు, చైనా దురాక్రమణపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఒక మెరుగైన చర్చ జరుగుతుందన్నారు.
#WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut says, "PM Modi has called a Special Session of Parliament. No one knows why this session is called. In Maharashtra, we have Ganesh Utsav so we can't go…We have heard that PM Modi wants to have a discussion on China invading Ladakh. If PM… pic.twitter.com/4gct2X9iS2
— ANI (@ANI) September 3, 2023
ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi ) తెలిపారు. అయితే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లును తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులతో పాటు జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఇన్సూరెన్స్ సవరణ బిల్లులను మోదీ సర్కార్ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇటీవల వర్షాకాల సమావేశాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన నేర న్యాయ బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేసిన నేపథ్యంలో.. వాటిని సభ ముందు పెట్టే చాన్స్ లేదని తెలిపాయి. ఇదే సమయంలో జీ20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఒక ప్రత్యేక తీర్మానం చేయనున్నదని పేర్కొన్నాయి.