ముంబై: శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)ని మళ్లీ ఒక్కటి చేసి, మహారాష్ట్రలోని అధికార కూటమికి మద్దతుగా నిలుపాలన్న అజిత్పవార్ వర్గం ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ అంశంపై చర్చించేందుకు అజిత్పవార్ వర్గం నేతలు ఇప్పటికే రెండుసార్లు శరద్పవార్ను కలిసి మాట్లాడినా ఫలితం దక్కలేదు. కలిసుందామన్న అజిత్ వర్గం నేతల ప్రతిపాదనకు శరద్పవార్ రెండుసార్లూ ఔననిగానీ, కాదనిగానీ చెప్పకుండా సమాధానం దాటవేశారు.
అజిత్పవార్ వర్గం నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సేలు ఆదివారం తొలిసారి ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో శరద్పవార్తో భేటీ అయ్యారు. పార్టీని ఐక్యంగా ఉంచుదామని, బీజేపీతో కలిసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీపడుదామని ఈ సందర్భంగా అజిత్పవార్ వర్గం నేతలు ప్రతిపాదించారు. అయితే శరద్పవార్ ఆ విషయంలో ఏమీ చెప్పకుండా మౌనం వహించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ అజిత్పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ మరోసారి వైబీ చవాన్ సెంటర్లో శరద్పవార్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మరోసారి ఐక్యత ప్రతిపాదన చేయగా.. శరద్పవార్ మళ్లీ మౌనమే దాల్చారు. ఆ ప్రతిపాదనకు సమాధానాన్ని దాటవేశారు. భేటీ అనంతరం ఈ విషయాన్ని అజిత్పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ మీడియాకు వెల్లడించారు.
కాగా, అజిత్ పవార్ ఇటీవల శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని రెండుగా చీల్చి తన వర్గంతో కలిసి మహారాష్ట్ర సర్కారులో చేరారు. అందుకు ప్రతిఫలంగా మహా సర్కారులో అజిత్పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన వర్గం ఎమ్మెల్యేల్లో 8 మందికి మంత్రి పదవులు దక్కాయి.