ముంబై: కొత్త ఏడాదిని వినూత్నంగా స్వాగతం పలికేందుకు పలు రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2022 జనవరి నుంచి వాటర్ ట్యాక్సీలను ప్రారంభించనున్నారు. దక్షిణ ముంబై, నవీ ముంబై మధ్య అవాంతరాలు లేని జల రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఫెర్రీ వార్ఫ్లోని డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ (డీసీటీ) నుంచి బేలాపూర్, నెరుల్లోని టెర్మినల్స్కు వాటర్ ట్యాక్సీ సేవలు ప్రారంభమవుతాయి.
అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఎలిఫెంటా, డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ (డీసీటీ) నుంచి రేవాస్, ధర్మతార్, కరంజాడే, డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బేలాపూర్, నెరుల్, ఐరోలి, వాషి, ఖండేరీ దీవులు, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్తో సహా పలు రూట్లను నాలుగు బోటు ఆపరేటర్లకు ప్రభుత్వం కేటాయించింది. జనవరి తొలి వారంలో తొలుత మూడు ఆపరేటర్లు వాటర్ ట్యాక్సీ సేవలను ఆరంభిస్తారు. రెండు-మూడు నెలల తర్వాత నాలుగో ఆపరేపర్ సేవలు ప్రారంభమవుతాయని సమాచారం.
ప్రస్తుతం ముంబై, నవీ ముంబై మధ్య రోడ్డు, రైలు మినహా ఇతర రవాణా సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో ముంబై నగరంలో ప్రధాన వాణిజ్య జిల్లా అయిన నవీ ముంబయి నుంచి దక్షిణ ముంబైకి అధిక సంఖ్యలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీసీటీ నుంచి జేఎన్పీటీని అత్యంత ప్రధాన జల మార్గంగా పేర్కొన్నారు.
డీసీటీ నుంచి నవీ ముంబైకి వాటర్ ట్యాక్సీ ఫేర్ రూ.1,200-రూ.1,500 మధ్య, డీసీటీ నుంచి జేఎన్పీటీకి సుమారు రూ.750 ఉండవచ్చని తెలుస్తున్నది. లోకల్ రైళ్లు, ప్రధానంగా హార్బర్ లైన్పై భారాన్ని తగ్గించడంలో బోటు ట్యాక్సీలు సహాయపడతాయని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.