CM KCR | దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాటర్ పాలసీని మార్చడానికి ఎవరినీ ప్రాధేయపడాల్సిన అక్కర్లేదు. నీటి వినియోగంపై బీఆర్ఎస్ ఎజెండా విప్లవాత్మకంగా ఉంటుందని కేసీఆర్ తేల్చిచెప్పారు. నాందేడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
దేశంలో నీటి వనరులకు కొదవ లేదు.. అవసరానికి మించి నీళ్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. నీళ్ల విషయంలో నేను చెబుతున్నది నా సొంత లెక్కలు కావు.. కేంద్ర జలశక్తి శాఖ చెప్పిన లెక్కలే చెబుతున్నాను. దేశంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. ట్రిబ్యునళ్ల పేరుతో దశాబ్దాల తరబడి నీటి వాటాలను నాన్చుతున్నారు. కృష్ణా నీళ్లపై బ్రిజేష్ ట్రిబ్యునల్ 20 ఏండ్లు అయినా ఒక్క తీర్పు ఇవ్వలేదు. సురక్షితమైన తాగునీరు లేక ప్రజలు అనేక రోగాల పాలవుతున్నారు. నీళ్లు లేక జరుగుతున్న కొట్లాట కాదు.. దేవుడు మనకు సరిపడ నీళ్లిచ్చాడు. అవసరానికి పోగా 20 వేల టీఎంసీల నీళ్లు మిగులుతాయి. నీటి కొట్లాటపై మేధావులు ప్రజలకు అవగాహన కల్పించాలని కేసీఆర్ సూచించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అతి చిన్నదేశమైన జింబాబ్వేలో ఉందన్నారు కేసీఆర్. ఈజిప్టు, కొలంబియా, చైనా, అమెరికా వంటి దేశాల్లో భారీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత పెద్ద మన దేశంలో ఒక్కటంటే ఒక్క పెద్ద రిజర్వాయర్ లేదు. చిన్న దేశాలైన సింగపూర్, జపాన్, మలేషియా, ఎంతో అభివృద్ధి చెందాయని కేసీఆర్ స్పష్టం చేశారు.