థాణే, అక్టోబర్ 14: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్న థాణే జిల్లాలోని కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిరిజన గ్రామాలకు నీటి ట్యాంకర్లు కూడా సరిగా రావడం లేదు. ఇలాంటి గ్రామాల్లో ‘మహ్రల్’ ఒకటి. ఈ గ్రామంలో నివసించే శకుంతల బాయి వాఘేకు(55) 30 ఏండ్లుగా కొండ కింద పారే చిన్న వాగు నుంచి రోజూ నీళ్లు తీసుకురావడమే ముఖ్యమైన పని.
రోజులో కనీసం నాలుగుసార్లు గ్రామంలోని మహిళలంతా రెండు, మూడు బకెట్ల నీళ్ల కోసం కొండ దిగి ఎక్కాల్సి ఉంటుంది. వర్షాకాలం వస్తే దారిలో జారిపడే ప్రమాదం ఉంటుంది. వాఘే కొన్నిసార్లు అలా జారిపడ్డారు కూడా. ‘మేము ఆరు తరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. కానీ మాకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలను కల్పించలేదు. నాయకులు ఎన్నికలప్పుడు వచ్చి నల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి వెళతారు. ఆ తర్వాత అధికారులొచ్చి కొలతలు తీసుకెళతారు. కానీ ఆ తర్వాత ఎవరూ కనిపించరు’ అని వాఘే ఆవేదన వ్యక్తం చేశారు. వాగు వద్ద రద్దీ తప్పించుకోవడానికి తెల్లవారుజామున 3 గంటలకే నీళ్ల కోసం వెళతానని ఆమె తెలిపారు. కొండ ఎక్కి దిగడం వల్ల అనారోగ్యం పాలయ్యానని వాపోయారు.
గంటన్నరపాటు నడిచి
వాగు ఎండిపోతే తమతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నీళ్ల కోసం గంటన్నరపాటు నడిచి రమాబాయి కొండ నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని శకుంతల బాయి తెలిపారు. ఎండాకాలంలో తమ గ్రామానికి నీళ్ల ట్యాంకర్ పంపించమని అధికారులను వేడుకున్నా తగిన ఫలితం లేదని.. చివరిసారిగా మార్చిలో ట్యాంకర్ను పంపించారని ఆమె వెల్లడించారు. గతంలో గ్రామంలో కామన్ ట్యాంక్ నిర్మించారని, ప్రతి ఇంటికి వేర్వేరు పైప్లైన్ వేసి నీటి సరఫరా చేస్తామని అధికారులు చెప్పారని సామాజిక కార్యకర్త పద్మాకర్ అహిర్ తెలిపారు. కానీ ఇప్పటివరకు అది అమలు చేయలేదన్నారు. ఈ సమస్యపై శివసేన(షిండే వర్గం) ఎమ్మెల్సీ మనీషా ఖయండే స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్, మంత్రిని కోరతానన్నారు. గిరిజన గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని సీఎం ఆఫీసుకు లేఖ రాస్తానని తెలిపారు.