లక్నో: దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు మాలో చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘2024 లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా అఖిలేష్ యాదవే పోటీ బరిలో దిగుతున్నారా..?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు అఖిలేష్ పైవిధంగా స్పందించారు.
కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ బీహార్లో ఒకసారి సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, మమతాబెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ, లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ, బీహార్ సీఎం నేతృత్వంలోని జేడీయూ సహా మొత్తం 20 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి.
ఈ నెల 18న ప్రతిపక్షాలన్నీ కలిసి రెండోసారి సమావేశం కానున్నాయి. బీజేపీ ఓటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఏయే పార్టీ ఏయే రాష్ట్రంలో ఏయే పార్టీతో పొత్తుపెట్టుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.