చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు మధ్య గొడవ జరిగింది. దాంతో ఇద్దరు నేతల మద్దతుదారులు మంగళవారం సాయంత్రం భటిండాలో బాహాబాహీకి దిగారు. పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగి రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ భటిండాలోని రమా మండి ఏరియాలో ఓ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హర్మీందర్ సింగ్ జెస్సీ మంగళవారం సాయంత్రం సభ ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే కుశ్చాజ్ సింగ్ జతానా తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగింది. దీనిపై హర్మీందర్ సింగ్ మాట్లాడుతూ.. కొంతమంది అనుకోకుండా తమ వద్దకు వచ్చారని, వచ్చీరావడంతోనే అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టారని చెప్పారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.