న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయించిన రైతులు.. గత 13 నెలల కాలంగా తాము చేస్తున్న ఆందోళనలను విరమిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో రైతులు ఢిల్లీలోని సింఘు సరిహద్దును వీడి ఇండ్లకు వెళ్లేందుకు భజన కార్యక్రమం ( Farmers Bhajan ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు భజన పాటలు పాడి అలరించారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 13 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహించారు. దాంతో ఎట్టకేలకు కేంద్ర సర్కారు తలొగ్గింది. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, పంటలకు మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. దాంతో ఈ విషయమై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.