Manipur CM : తెగల మధ్య గొడవలతో ఇటీవల మణిపూర్ (Manipur) అట్టుడికింది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి (Manipur CM) బీరేన్ సింగ్ (Biren Singh) క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు ఎంతో కష్టంగా గడిచిపోయిందని, ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
తెగల వైరంతో దాదాపు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని బీరేన్ సింగ్ చెప్పారు. చాలామంది ఇళ్లను వదిలిపెట్టి పోయారని తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, 625 మంది నిందితులు అరెస్టయ్యారని చెప్పారు. పోలీసులు మొత్తం 5,600 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
అయితే గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి నెలకొందని బీరేన్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగినంత భద్రతా సిబ్బందిని పంపిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో పూర్తిస్థాయిలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన తప్పిదాలను క్షమించుదామని, చేదు జ్ఞాపకాలను మర్చిపోదామని చెప్పారు. అన్ని జాతుల ప్రజలు కలసికట్టుగా జీవించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో అందరం కొత్త జీవితాలను ప్రారంభిద్దామని బీరెన్ సింగ్ పిలుపునిచ్చారు.