న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు తెగబడ్డారు. రూప్ నగర్ ఏరియాలోని శక్తినగర్లో రాత్రివేళ బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని దొంగలు బైకులతో ఢీకొట్టి అతని జేబులో ఉన్నకాడికి లూటీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలోపడ్డారు. సీసీ ఫుటేజ్ ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఒక వ్యక్తిని రెండు బైకులపై నలుగురు దొంగలు వెంబడిస్తూ వచ్చారు. ఆ తర్వాత జనం రద్దీ తక్కువగా ఉన్న ప్రదేశం చూసి అతడి బైకును ఢీకొట్టారు. బాధితుడు కిందపడగానే అతడి జేబులో నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు. అతడు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారు. కాళ్లతో తన్నారు.
ఇదంతా చూస్తూ కూడా ఆ దారిలో వచ్చిన కొందరు వాహనదారులు ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయారు. కానీ చివరికి ఒక కారులో ఉన్నవాళ్లు మాత్రం ధైర్యం చేసి కారును ఆపేశారు. దాంతో దుండగుల్లో ఒకడు కారు ఎందుకు ఆపారంటూ వాళ్లపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేశాడు. ఇలా అతడు కారులో వాళ్లను బెదిరిస్తుండగానే మిగతా ముగ్గురు బాధితుడిని లూటీచేశారు.
ఆ తర్వాత బాధితుడి ఎడమకాలుపై ఒక రౌండ్ కాల్పులు జరిపి నలుగురూ అక్కడి నుంచి ఉడాయించారు. జనవరి 14న రాత్రివేళ జరిగిన ఈ దారుణం అంతా అక్కడికి దగ్గర్లో సీసీ కెమెరాలో రికార్డయ్యింది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | CCTV footage of January 14 from Delhi’s Shakti Nagar, Roop Nagar area, where 4 people on 2 motorbikes looted a 42-year-old man by shooting at his right leg. pic.twitter.com/wv29g8Qlkf
— ANI (@ANI) January 17, 2023