న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఢిల్లీ అసెంబ్లీలో అధికార ఆప్ ఎమ్మెల్యే రితురాజ్ ఝా సోమవారం కేంద్రంలోని బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్ పార్టీని వీడి తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చి బీజేపీలో చేర్చితే ఒక్కొక్కరికీ రూ.25 కోట్ల చొప్పున ఇవ్వడంతో పాటు తనకు మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. ఇలాంటి చీప్ ట్రిక్కులతో ఆప్ను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ఎత్తులు వేస్తున్నదని ఆయన విమర్శించారు.
ఆదివారం ఇండియా మహార్యాలీలో పాల్గొన్న అనంతరం ఒక వివాహానికి హాజరయ్యానని, అంతకు ముందు మూడు నాలుగు రోజుల నుంచి ఫోన్ ద్వారా తనతో మాట్లాడటానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు ఈ 25 కోట్ల ప్రతిపాదన తెచ్చారన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా తీవ్రంగా ఖండించారు.