ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ముంబై కోర్టు వారెంట్ జారీ చేసింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధాసోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ను జారీ చేయడంతో పాటు ఈ నెల 18న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సెవ్రీ మెట్రోపాలిటన్ కోర్టు గత నెలలో సంజయ్ రౌత్కు సమన్లు జారీ చేసి, జూలై 4న హాజరుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో రౌత్, ఆయన తరఫున న్యాయవాది సోమవారం కోర్టుకు హాజరుకాలేదు. ఈ విషయాన్ని మేధా తరఫున న్యాయవాది వివేకానంద గుప్తా కోర్టుకు తెలిపారు.
కోర్టుకు హాజరుకానందున వారెంట్ జారీ చేస్తామని చెప్పగా, దానికి కోర్టు అనుమతించిందని న్యాయవాది గుప్తా తెలిపారు. అనంతరం కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఇందులో ఆయన భార్య మేధా ప్రమేయం ఉందని సంజయ్ రౌత్ గతంలో ఆరోపించారు. దీంతో ఆమె తన పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.