NDA VS Mahagathbandhan : బిహార్లో నితీష్ కుమార్ సారధ్యంలో ఇటీవల కొలువుతీరిన ఎన్డీయే ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుండటంతో ఉత్కంఠ నెలకొంది. బలపరీక్షకు ముందు పాలక ఎన్డీయే, మహాకూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాలక, విపక్ష శిబిరాలు క్యాంపు రాజకీయాలను హోరెత్తిస్తున్నాయి.
మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం హాట్ టాపిక్గా మారింది. సీఎం నితీష్ కుమార్ సైతం అక్కడ ఎక్కువ సమయం గడపలేదు. ఇక తేజస్వి యాదవ్ అధికార నివాసంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలుండగా సీపీఐఎంఎల్ ఎమ్మెల్యేలు సైతం ఆపై అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యేల సహాయ సిబ్బంది వారి నేతలకు దుస్తులు, ఇతర అత్యవసరాలను లోపలికి పంపడం కనిపించింది.
ఇక ఆర్జేడీ ఎమ్మెల్యేలు మరో 48 గంటలు అక్కడే ఉంటారని లోపల వారంతా అంత్యాక్షరి ఆడుతున్నారని ఎంపీ మనోజ్ ఝా తెలిపారు. ఇక ఆర్జేడీ అసెంబ్లీ బలపరీక్షలో ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను నిర్బంధించిదని సొంత ఎమ్మెల్యేలను తేజస్వి నివాసంలో నిర్బంధించారని బీజేపీ దుయ్యబట్టింది. బిహార్లో విపక్ష కూటమి బలంగా ఉందని, తమ ఎమ్మెల్యేలు శిబిరంలో ఉల్లాసంగా ఉన్నారని కాషాయ పార్టీ విమర్శలను తిప్పికొడుతూ ఆర్జేడీ పేర్కొంది. ఇక అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా చూసేందుకు స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలనే ఆర్జేడీ కిడ్నాప్ చేసిందని బీజేపీ ఆరోపించింది.
Read More :