న్యూఢిల్లీ : మనీలాండింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వ్యవహారం మరో మలుపు తీసుకున్నది. మంత్రి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ అని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మంత్రికి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ కాదని.. పోక్సో యాక్ట్ కింద శిక్ష అనుభవిస్తున్న నిందితుడు రింకూ అని తీహార్ జైలు అధికార వర్గాలు చెప్పినట్లు సమాచారం. రింకూ లైంగిక దాడి కేసులో నిందితుడని, పోక్సో చట్టంలోని సెక్షన్ 6, ఐపీసీ 376, 506, 509 కింద అభియోగాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.
మరో వైపు సత్యేందర్ జైన్కు మసాజ్ చేసింది రేపిస్ట్ అని బీజేపీ నేత షాజాద్ పూనావాలా ట్వీట్ చేశారు. అతను ఫిజియోథెరపిస్ట్ కాదని.. రేపిస్ట్ అని ఆరోపించారు. వారు నిజంగా తీహార్ను థాయ్లాండ్గా మార్యారని విమర్శించారు. సత్యేందర్ జైన్ను బర్తరఫ్ చేయాలని, అవినీతిని సమర్థించడం ఆపాలన్నారు. మరో వైపు కాంగ్రెస్ నేత అల్కా లాంబ ఆప్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమ్మాయిలపై లైంగిక దాడి చేసే వారితో సేవలు చేయించుకుంటున్నారని, ఆ తర్వాత వారిని రక్షిస్తారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. తీహార్ జైలులో సత్యేందర్ జైన్ బ్యారక్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫుటేజీలో ఓ వ్యక్తి సత్యేందర్ జైన్ పాదాలకు మసాజ్ చేస్తూ కనిపించాడు. ఈ ఫుటేజీని ఈడీ కోర్టుకు సైతం అందించేసిన విషయం తెలిసిందే. సత్యేందర్ జైన్ తీహార్లోని ఏడో నెంబర్ జైలులో ఉన్నారు. సత్యేందర్ జైన్కు సౌకర్యాలు కల్పించినందుకు జైలు సూపరింటెండెంట్తో సహా నలుగురు జైలు అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేశారు.
అదే సమయంలో 35 మందికిపైగా జైలు అధికారులు, సిబ్బంది మార్చారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ను ఈడీ మే 30న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై కేసు నమోదు చేసింది. అంతకు ముందు ఏప్రిల్లో జైన్ కుటుంబానికి చెందిన రూ.4.81కోట్ల విలువైన స్థిరాలను జప్తు చేసింది.