బెంగళూరు, నవంబర్ 26: కర్ణాటకలో ఓటర్ ఐడీ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఓటర్ల డాటాను దొంగిలించడంలో ప్రత్యక్షంగా కేంద్రం ప్రమేయం ఉన్నదని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా శనివారం అన్నారు. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చిలుమే ఇన్స్టిట్యూట్కు చెందిన రవికుమార్ ఉండే ప్రాంతానికి చెందిన పలువురికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ కంపెనీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పాత్రకు ఇది ప్రత్యక్ష సాక్ష్యమని, ఓటర్ల డాటా దొంగిలించడంతో పాటు సామాన్య ప్రజల పన్ను సొమ్ము కూడా లూటీ అయిందని సుర్జేవాలా ఆరోపించారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 20 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి, బెంగళూరులో స్థిరపడిన నకిలీ ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ ఆందోళన పడుతున్నదని బీజేపీ చెబుతున్నది.
అసలేం జరిగింది?
ఓటర్ల వ్యక్తిగత వివరాల సేకరణ ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను గల్లంతు చేసే కుట్ర జరిగిందని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బెంగళూరులో చిలుమే ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ప్రైవేటు సంస్థ గత ఆగస్టు నుంచి ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల ఆధార్, ఓటర్ ఐడీతోపాటు పలు వివరాలు సేకరించింది. వీటిని ఈసీ యాప్ గరుడలో కాకుండా తన వెబ్సైట్లో ఉంచింది. ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకొన్నది. తమ సిబ్బందిని బూత్స్థాయి అధికారుల నకిలీ గుర్తింపు కార్డులతో రంగంలోకి దింపింది. మహదేవపుర, శివాజీనగర నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు, ఎమ్మెల్యేల పనితీరు గురించి సమాచారం సేకరించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఓటర్ల డాటాను తస్కరించేందుకు సీఎం బొమ్మై ఈ కుంభకోణానికి తెరలేపారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.