ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగే వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్ఆర్సామ్) పరీ|క్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని చాందీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి భారత్ మంగళవారం ఈ క్షిపణిని పరీక్షించింది. నేవీ షిప్ నుంచి హై స్పీడ్ మావనరహిత విమానాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), ఇండియన్ నేవీ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. వీఎల్ ఎస్ఆర్సామ్ క్షిపణిని డీఆర్డీవో స్వదేశీ టెక్నాలజీతో రూపొందించి, అభివృద్ధి చేసింది. క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం కావడంతో డీఆర్డీవో, భారత నౌకాదళం, అనుబంధ బృందాలను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అభినందించారు. ఇది భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.