Ram Madir | రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్కు అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా మార్చేశారని విమర్శించింది. సుప్రీంకోర్టు తీర్పు, ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, రామాలయం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ గైర్హాజరుకావడంపై విశ్వ హిందూ పరిషత్ తీవ్రస్థాయిలో స్పందించింది.
స్వాతంత్య్రం అనంతరం నిర్మించిన సోమ్నాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు నెహ్రూ నిరాకరించారని.. ఆ సంప్రదాయాన్నే కాంగ్రెస్ ఇప్పటికీ అనుసరిస్తోందని వీహెచ్పీ విమర్శించింది. ఆ పార్టీ నేత శరద్ శర్మ మాట్లాడుతూ.. రాముడిని చూడాలనుకుంటున్న వారికి మాత్రమే ఆయన దర్శనం లభిస్తుందన్నారు.
కాంగ్రెస్ ఆలోచనలు రాజకీయాల నుంచి స్ఫూర్తి పొందాయని.. ఎక్కడ చూసినా ఓటు బ్యాంకు కోసం వెతుకులాడుతుంటారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో సోమ్నాథ్ ఆలయ సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జవహర్లాల్ నెమ్రూ వ్యతిరేకించారని.. బాబు రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ సోమ్నాథ్ ఆలయానికి శంకుస్థాపన చేశారన్నారు. ఓటు బ్యాంకు పోతుందనే భయంతోనే కాంగ్రెస్ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.