ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలోకి చిరుత ప్రవేశించింది. దీనిని చూసిన కార్మికులు భయాందోళన చెందారు. దీంతో ఆరు గంటలపాటు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు ఆ చిరుతను సురక్షితంగా పట్టుకుని బంధించారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. వంద ఎకరాల్లో విస్తరించిన మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలోని ఒక ఫ్లోర్లోకి సోమవారం తెల్లవారుజామున ఒక చిరుత పులి చొరబడింది. అక్కడ పని చేసే కార్మికులు దీనిని చూసి భయాందోళన చెందారు. దీంతో ఆ ఫిష్ట్లోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
కాగా, మానిక్దో చిరుత రెస్క్యూ సెంటర్ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన చిరుత జాడ కోసం వెతికారు. చివరకు ఒక ఫ్లోర్లో దాగిన చిరుతను గుర్తించారు. సురక్షిత ప్రాంతం నుంచి దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం దానిని సురక్షితంగా పట్టుకుని బోనులో బంధించారు. దీంతో ఆరు గంటల తర్వాత ఎట్టకేలకు ఉదయం 11.30 గంటలకు చిరుతను బంధించే ఆపరేషన్ ముగిసింది.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలో ఆరు గంటలకుపైగా పనులు నిలిచిపోయాయి. సిబ్బందిని కూడా ఇళ్లకు పంపేశారు. దీంతో వాహనాల ఉత్పత్తితోపాటు డిస్పాచ్కు అంతరాయం ఏర్పడింది. ఈ మగ చిరుత వయసు 2-3 ఏండ్లు అని అటవీశాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజులు పరిశీలనలో ఉంచిన తర్వాత దానిని తిరిగి అడవిలో విడిచిపెడతామని వెల్లడించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Surprise visitor at @MercedesBenzInd car plant today
Forest dept officials are trying to rescue the Leopard. All employees told to go home, no production or dispatches today pic.twitter.com/PelLyiXSKA— Sirish Chandran (@SirishChandran) March 21, 2022