చండీగఢ్: నీటి నుంచి భూమి పైకి లేచిన ఘటన కలకలం రేపింది. హర్యానాలో జరిగిన దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. అయితే హర్యానాలోని ఒక నదీ ప్రవాహంలో నీటి నుంచి ఉన్నట్టుండి భూమి పైకి లేచింది. నీటిపై కొన్ని అడుగుల ఎత్తుకు భూమి లేవడాన్ని గమనించిన స్థానికులు తమ మొబైల్స్లో వీడియో తీశారు. ఇలా నీటి నుంచి భూమి పైకి లేవడాన్ని తాము ఎప్పుడూ చూడలేదన్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. నీటిపై భూమి పైకి లేవడానికి కారణం ఏమిటన్నదానిపై కొందరు పలు అభిప్రాయాలు తెలిపారు. టెక్టోనిక్ ప్లేట్ కదలికల వల్ల భూమి పెరిగి ఉండవచ్చునని కొంత మంది తెలిపారు. అయితే టెక్టోనిక్ ప్లేట్ కదలిక వల్ల కాదని, భూమి లోపలున్న మీథేన్ గ్యాస్ విడుదల వల్ల నీటిలోని తడి పొర బుడగలాగా పైకి లేచిందని మరి కొందరు పేర్కొన్నారు.