న్యూఢిల్లీ : బెంగళూర్, ఢిల్లీ సహా మన మెట్రో నగరాల్లో ట్రాఫిక్లో చిక్కుకున్నామంటే ఇంటికి ఎప్పుడు చేరతామో తెలియని పరిస్ధితి. ఆఫీసులకు సమయానికి చేరాలంటే ఎంతో ముందుగా బయలుదేరాల్సి ఉంటుంది. అయితే మిజోరాంలోని ఐజ్వాల్లో బారులుతీరిన వాహనాలు క్రమ పద్ధతిలో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రమబద్ధీకరించిన ట్రాఫిక్ను చూసిన నెటిజన్లు ఐజ్వాల్ ఇండియన్ సైలెంట్ సిటీ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
మిజోరాంలోని ఐజ్వాల్ సిటీలో ఓ వీధిలోని ట్రాఫిక్ను కండ్లకు కడుతున్న వీడియోను ట్రావెల్ బ్లాగర్ ఎలిజబెత్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇరుకైన రోడ్పైనే కార్లు, బైక్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళుతుండటం కనిపించింది. కార్లు, బైక్లు వేర్వేర్లు లేన్స్పై వెళుతుండటం క్లిప్లో మనం చూస్తాం. ఏ వాహనం మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించకపోవడం ఈ వీడియోలో గమనించవచ్చు.
ఐజ్వాల్లో ఇక్కడ ప్రతిఒక్కరూ తమ వంతు వచ్చే వరకూ సహనంతో వేచిచూస్తారు..ప్రతి భారత నగరంలోనూ దీన్ని పాటించడం మేలని ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2.6 లక్షల లైక్స్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ట్రాఫిక్ జామ్స్ను నివారించేందుకు భారతీయ నగరాలన్నీ ఈ ట్రాఫిక్ మోడల్ను అనుసరించాలని యూజర్లు కోరుతున్నారు.