భటిండా: వధువు ఎంపిక కోసం పంజాబ్లోని భటిండా పట్టణానికి చెందిన తండ్రీ కొడుకులు వింత నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 23న అందాల పోటీ నిర్వహించి అందులో గెలిచిన యువతికి కెనడాలో ఉండే NRI ని వివాహం చేసుకునే అవకాశం కల్పించాలని భావించారు. అనుకున్నదే ఆలస్యం భటిండాలోని అజీత్ ప్రాంతం అంతటా పోస్టర్లు వేయించారు. ఈ నెల 23న జరిగే అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలవండి.. కెనడాకు చెందిన NRI వరుడిని వివాహం చేసుకోండి.. అని ఆ పోస్టర్లలో ఆఫర్ చేశారు. ఈ వింత, వివాదాస్పద పోస్టర్లు వేసిన కాసేపటికే సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్గా మారాయి.
భటిండాలోని అజీత్ ప్రాంతానికి చెందిన తండ్రీ కొడుకులు అందాలపోటీ నిర్వహించి కెనడాలో ఉండే NRI వరుడికి వధువును ఎంపిక చేయాలని భావించారు. ఆ మేరకు గత గురువారం అజీత్ ప్రాంతంలోని గోడలపై పోస్టర్లను వేయించారు. ఆ పోస్టర్లు అలా గోడలపైకి ఎక్కాయో లేదో క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అందాల పోటీలో విజేతగా నిలిచిన వారికి బహుమతిగా కెనడాలో ఉండే ఎన్నారై వరుడితో వివాహం జరిపిస్తాం. ఈ నెల 23న స్థానిక హోటల్లో పోటీలు నిర్వహిస్తున్నాం అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆ పోస్టర్లను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్గా మారాయి.
మహిళలను కించపరిచేలా ఉన్న ఈ పోస్టర్లపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ పోస్టర్లు వేయించిన తండ్రీకొడుకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై 1986 నాటి మహిళా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై పంజాబ్ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి బల్జీత్ కౌర్ స్పందించారు. వధువు ఎంపిక కోసం అందాల పోటీ నిర్వహించడం విచారకరమని మండిపడ్డారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.