Viral news : ఆ బ్యాంక్ మేనేజర్కు నాటు కోడి కూర అంటే చాలా ఇష్టం..! నాటు కోడి కూర కోసం అతడు చెవులు కోసుకోమన్నా కోసుకుంటాడు..! పుష్టిగా నాటు కోడి కూర తినడం కోసం అతను వెంపర్లాడుతుంటాడు..! ఈ క్రమంలో నిత్యం నాటు చికెన్ తినడం కోసం ఆ మేనేజర్ ఒక ప్లాన్ వేశాడు..! ఒక రైతు అవసరాన్ని అసరాగా చేసుకుని తన కోరిక నెరవేర్చుకున్నాడు..! ఏకంగా రూ.39 వేల విలువ చేసే నాటు కోళ్లు తిన్నాడు..! ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్కు కోళ్ల ఫారమ్ ఉన్నది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు.
లోన్ వస్తదన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు. ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు.
అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.