ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. బిహార్లోని గయలో ఉన్న ఒక ఆలయంలో దేవుళ్ల కోసం ఫ్యాన్లు, ఏసీలు అమర్చారు. ఈ విషయాన్ని గయలోని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు జగదీష్ శ్యామ్ దాస్ ధ్రువీకరించారు.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని, ప్రజలంతా ఫ్యాన్లు, ఏసీల ద్వారా ఊరట పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే దేవుళ్లకు కూడా ఎండ నుంచి రక్షణ కోసం ఫ్యాన్లు, ఏసీలు అమర్చినట్లు తెలిపారు. ఆలయంలోని రాధాకృష్ణులు, జగన్నాథుడి విగ్రహాలకు సమీపంలో ఏసీలు అమర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది తెలిసిన చాలా మంది భక్తులు ఆ గుడికి వెళ్లి అక్కడ చేసిన ఏర్పాట్లను చూసి సంతోషిస్తున్నారు.