న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురిచేశారని స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్, డబ్ల్యూఎఫ్ఐకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన నేపధ్యంలో ఫొగట్ ఈ ఆరోపణలు చేశారు.
బ్రిజ్ భూషణ్ తనను మానసికంగా వేధించడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని కూడా ఆమె పేర్కొన్నారు. లైంగిక వేధింపులపై గతంలో తాను పెదవివిప్పలేదని కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఫొగట్ చెప్పారు. సాక్షి మాలిక్, భజరంగ్ పునియా సహా ఒలింపిక్ మెడలిస్టులతో పాటు 31 మంది రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టగా వినేష్ ఫొగట్ విలేకరులతో మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో విరుచుకుపడ్డారు.
మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, ఆయన తనను పనికిమాలినదానినని వ్యాఖ్యానించడంతో మనస్ధాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వినేష్ పేర్కొన్నారు. కాగా డబ్ల్యూఎఫ్ఐ చీప్ బ్రిజ్ భూషణ్ సింగ్ యూపీలోని కైసర్ గంజ్ బీజేపీ ఎంపీ కావడం గమనార్హం.