పెళ్లి జరుగుతుండగా.. ‘జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్’ అంటూ గట్టిగా అరుస్తూ ఒక అల్లరి మూక దూసుకొచ్చి అక్కడున్న వారిపై కాల్పులు జరిపింది. దీంతో అక్కడ ఒక గ్రామ పెద్ద గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్య మార్గంలోనే మరణించాడు. ఈ ఘటన డిసెంబర్ 12న మధ్యప్రదేశ్లోని మండసోర్ జిల్లాలోని జామునియా గ్రామంలో జరిగింది.
పోలీసులు కేసు నమోదు చేసి 11 మంది నిందితులను గుర్తించారు. అందులో నలుగురు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పెళ్లిలో ఒక వ్యక్తి వీడియో తీయడంతో పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. నిందితులంతా ఆ గ్రామస్తులే కావడం విశేషం.
పోలీసుల కథనం ప్రకారం.. భెసోడి మండి గ్రామంలోని బాబా రాంపాల్ అనే మత గురువు అనుచరులు జామునియా గ్రామంలో జరిగే వివాహానికి తరలివచ్చారు. కానీ వారి రాకను గ్రామస్తులు వ్యతిరేకించారు. పెళ్లికి ముందు.. బాబా అనుచరులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఆ తరువాత పెళ్లి ముహూర్తం సమయంలో గ్రామస్తులు గుంపుగా జై శ్రీ రామ్ అంటూ అరుస్తూ అక్కడికి దూసుకొచ్చి కాల్పులు జరిపారు. ఆ సమయంలో పెళ్లికి అతిథిగా వచ్చిన గ్రామ పెద్ద దేవీ లాల్ మీనాకు గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గంలోనే ఆయన మృతి చెందాడు.