బరేలి, ఆగస్టు 18: ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రాగానే వీధి పశువుల బెడదను చిటికెలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ధర్మపాల్ సింగ్కు శుక్రవారం నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ని రైతులు వీధి పశువులతో అడ్డగించారు. దీంతో మంత్రి 40 నిమిషాలు పాటు అక్కడే నిలిచిపోయారు.
అమియాలోని ఒక పశువుల చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించడానికి మంత్రి ధర్మపాల్ వెళ్తుండగా ఈ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇది తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న స్థానిక పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. విచ్చలవిడిగా గ్రామాల్లో తిరుగుతున్న వీధి పశువుల మందల కారణంగా రోజూ నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని, అవి తమ పంటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. వీధి పశువుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో పశువుల మందను అక్కడి నుంచి తోలి మంత్రి కాన్వాయ్కు దారి వదిలారు.