రాయ్పూర్: అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది రైడ్ చేశారు. అయితే గ్రామస్తులు వారిని ప్రతిఘటించి ఎదురుదాడి చేశారు. దీంతో పలువురు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది గాయపడ్డారు. ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింఘన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్గావ్ గ్రామంలో అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది గురువారం అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రెచ్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిపై కర్రలతో దాడులు చేశారు. ఊహించని ఈ సంఘటనకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది షాక్ అయ్యారు. కొందరు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. గ్రామస్తుల దాడిలో పలువురు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, నాటుసారా తయారీపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా ఈ సంఘటన జరిగింది. నాటు సారా తయారీని అడ్డుకుని వాటిని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిపై వారు దాడి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న 15 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.