బెంగళూరు, నవంబర్ 21: కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి జనం దేహశుద్ధి చేశారు. చిక్మగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆదివారం ఏనుగు దాడి వల్ల మరణించిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా కుందూర్ ఎస్టేట్ సమీపంలో ఓ గ్రామ ప్రజలు చితకబాదారు. తమ గ్రామంపై ఏనుగులు పదేపదే దాడి చేస్తున్నాయని, వాటిని నిరోధించేందుకు అధికారులు, ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందని, ఆ సమయంలో పోలీసులు తనకు తగినంత రక్షణ కల్పించలేదని కుమారస్వామి ఆరోపించారు. ఈ దాడి అనంతరం ఎమ్మెల్యేని తమ వాహనంలో తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన చిరిగిపోయిన చొక్కాతో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై స్థానికులు మరోసారి భగ్గుమన్నారు. పోలీసు వాహనంలో కుమారస్వామిని తీసుకెళ్లేటప్పుడు ఆయన చొక్కా బాగానే ఉన్నదని, వీడియోలో చొక్కా చిరిగిపోయి ఉండటం వెనుక మర్మం ఏమిటని నిలదీశారు.