రాంచీ : జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. టోంటో ఏరియాలోని రెగ్రహటూ గ్రామ సమీపంలో ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని రెగ్రహటూ గ్రామానికి చెందిన చేతన్ కోడాగా పోలీసులు గుర్తించారు. చేతన్ కోడా అడవిలోకి కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
సింగ్భూమ్ జిల్లాలో గత కొంతకాలం నుంచి సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కార్యకలాపాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా బలగాలను లక్ష్యం చేసుకుని మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. రెగ్రహటూ గ్రామంలో మావోయిస్టుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.