అది డబుల్ ఇంజిన్ రాష్ట్రం.. తమ పాలనలో ప్రజల బతుకులు బంగారుమయం అవుతాయని మొదటి ఇంజిన్ నాయకుడు మోదీ.. రెండో ఇంజిన్ నేత యోగీ నిత్యం ఉపన్యాసాలు దంచుతుంటారు. ప్రపంచానికే మా పాలన రోల్ మాడల్ అన్నంత బిల్డప్ ఇస్తుంటారు. కానీ.. అక్కడ వాకిళ్లు పొక్కిలి లేస్తున్నాయి. జనం లేక ఇండ్ల తలుపులు కిర్రుమని గాలికి ఊగుతున్నాయి. ఊర్లకు ఊర్లు పొట్టచేతబట్టుకొని పట్టణాలకు వలసపోతున్నాయి.. ఉపాధి హామీ పథకం ఉన్నా ఉపయోగం లేకుండాపోయింది. చేద్దామంటే పని ఇవ్వరు.. చేసిన పనికి డబ్బులూ ఇవ్వరు.. ఆ డబుల్ ఇంజిన్ రాష్ట్రమే ఉత్తరప్రదేశ్.. అన్నమో రామచంద్రా అంటున్న ఆ రాష్ట్రంలోని ప్రాంతమే బుందేల్ఖండ్..
మరొకటి సింగిల్ ఇంజిన్ రాష్ట్రం.. అక్కడ ప్రతి జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించేందుకు పోటీ పడుతున్నాయి. ఏటా కోట్ల పనిదినాలు కల్పిస్తూ ఉపాధికి హామీ ఇస్తున్నాయి.. ఆ సింగిల్ ఇంజిన్ రాష్ట్రమే తెలంగాణ.. కేవలం 56 రోజుల్లోనే ఏకంగా 30 లక్షల పనిదినాలు కల్పించి రికార్డు సృష్టించిన జిల్లా వికారాబాద్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మహబూబ్నగర్. వేలమంది ఇక్కడి నుంచి వలస పోయేవారు. పాలకులు ఎందరు మారినా బుందేల్ఖండ్ తలరాత మారలేదు. కానీ, ఎనిమిదేండ్లలోనే మహబూబ్నగర్ జిల్లా స్వరూపం మారిపోయింది. బుందేల్ఖండ్ ప్రజలు ఇప్పటికీ వలస పోతుంటే.. మహబూబ్నగర్కు రివర్స్ వలసలు మొదలయ్యాయి. ఇదీ సింగిల్ ఇంజిన్కు.. డబుల్ ఇంజిన్కు ఉన్న తేదా..
తెలంగాణ < రాష్ట్రం > యూపీ
3.85 కోట్లు < జనాభా > 23.1 కోట్లు
48.8 లక్షలు < ఉపాధి హామీ పథకం అర్హులు > 3.33 కోట్లు
48.79 లక్షలు (99.9%) < ఉపాధి పొందినవారు > 1.3 కోట్లు (39.03%)
14.25 కోట్లు < ఆమోదించిన పనిదినాలు > 150 కోట్లు
14.75 కోట్లు 103.5% < కల్పించిన పనిదినాలు > 45 కోట్లు 30%
రూ. 4,394.5 కోట్లు < ఖర్చుచేసిన మొత్తం > రూ. 8,700 కోట్లు
కేంద్రంలో, యూపీలో బీజేపీయే అధికారంలో ఉన్నది. కానీ బుందేల్ఖండ్లో ప్రజలకు ఉపాధి లేక రోజులు దినదినగండంగా మారాయి. కేంద్రంలో, యూపీలో బీజేపీయే అధికారంలో ఉన్నది. కానీ బుందేల్ఖండ్లో ప్రజలకు ఉపాధి లేక రోజులు దినదినగండంగా మారాయి.
ఇదే సమయంలో గ్రామాల్లోనే చేతి నిండా పని దొరుకడంతో తెలంగాణ పల్లెలు కళకళలాడుతున్నాయి.
లక్నో/పరిగి, మే 27: ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు ఏకంగా 1,50,00,000 మందికి ఉపాధి కల్పించాం. పనిచేసిన ప్రతిఒక్కరికీ తాత్సారం చేయకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నాం’.. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో సర్కారు చెప్తున్న మాట ఇది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చేద్దామంటే పని దొరక్క, చేసిన పనికి డబ్బులు రాక సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో పల్లె ప్రజలు అన్నమో రామచంద్రా అంటున్నారు. భార్యా, బిడ్డలను పోషించుకోవడానికి సొంతూళ్లను వదిలి పట్టణాలు, నగరాలకు వలసపోతున్నారు.
యూపీలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న బందా జిల్లాలో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. ప్రజలు పల్లెల్లో ఉపాధి లేక సమీప నగరాలకు వలసపోతున్నారు. ముఖ్యంగా సుఖారీ పూర్వ, జర్వా చౌకీ, నిబీ, నౌగవన్, కచ్చియన్ పూర్వా, బిలిహర్కా తదితర గ్రామాల్లోని దాదాపు 50 వేల మంది ప్రజలు పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాలకు ఇప్పటికే వలస వెళ్లారు. దీంతో జనం లేక ప్రతి ఇంటికీ తాళం కప్ప వేలాడుతున్నది. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద గ్రామస్థులకు పని ఇవ్వకపోవడం, ఇప్పటివరకూ చేసిన పనికి చెల్లింపులు కూడా చేయకపోవడంతో బతకడానికి తప్పనిసరై వలస పోతున్నామని గ్రామస్థులు చెప్తున్నారు. కూలీలకు ఏడాది నుంచి చెల్లింపులను గ్రామ ప్రధాన్లు నిలిపివేసినట్టు సమాచారం.
మాది సుఖారీ పూర్వ గ్రామం. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద ఏండ్లుగా పనిచేస్తున్నా. గత ఏడాది కాలంగా చెల్లింపులు లేవు. ఇదే విషయాన్ని ప్రధాన్ వద్ద ప్రస్తావించా. ‘నన్నే ప్రశ్నిస్తావా?’ అంటూ ఇప్పుడు పని కూడా ఇస్తలేడు. దీంతో కుటుంబంతో కలిసి అలహాబాద్కు వలస వచ్చా. ఇక్కడ ప్రస్తుతం కూలీ పని చేస్తున్నా. గ్రామంలో చెరువు, కాలువలు తవ్వడానికి మమ్మల్ని ఉపయోగించుకొన్నారు. చెల్లింపులు చేయమంటే మాత్రం ముఖం చాటేశారు. చేయడానికి పనిలేక గ్రామంలోని మొత్తం 85 కుటుంబాల్లో ఇప్పటికే 55 కుటుంబాలు పల్లెను వదిలి వెళ్లిపోయాయి. త్వరలోనే మిగతావారు కూడా గ్రామాన్ని వదిలివెళ్తారు.
-సునీల్ కుమార్, సుఖారీ పూర్వ గ్రామస్థుడు
యూపీలో ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవటంతో ప్రజలు వలస పోతుంటే.. తెలంగాణలో లక్ష్యానికి మించి ఉపాధి కల్పిస్తుండటంతో గతంలో పట్టణాలకు వలస పోయినవారు కూడా తిరిగి సొంత గ్రామాలకు చేరుకొంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద పని కల్పించడంలో వికారాబాద్ జిల్లా ఈ ఏడాది కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా పరిధిలో 4,39,844 మంది ఉపాధి కూలీలుండగా, వారికి 2,00,222 జాబ్ కార్డులు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.192.75 కోట్ల విలువైన 75 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కేవలం 56 రోజుల్లో (ఏప్రిల్ 1 నుంచి మే 26 వరకు) 29,94,232 పనిదినాలు కల్పించి రికార్డు సృష్టించారు. మొత్తం 88,875 కుటుంబాలకు చెందిన 1,58,685 మంది కూలీలకు పనులు కల్పించారు. రూ.76.95 కోట్ల విలువైన పనులు చేపట్టారు. రూ.52.12 కోట్ల కూలీ డబ్బులు ఇప్పటికే చెల్లించారు. పని చేసిన 15 రోజుల్లోనే కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. గత ఏడాది కూడా అత్యధిక పనిదినాలతో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో నంబర్ వన్గా నిలిచింది. ఈ ఏడాది రోజువారీ కూలీల సంఖ్యలోనూ రాష్ట్ర స్థాయిలో వికారాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు లక్షమందికి పని కల్పించారు. మట్టి కట్టలు, చెరువుల్లో పూడికతీత, భూమి చదును చేయడం, రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం గుంతలు తీసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిధిలో ఉపాధి హామీ ద్వారా సుమారు 75 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించగా 56 రోజుల్లోనే 29.94 లక్షల పనిదినాలు కల్పించాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ ద్వారా కూలీలకు పని కల్పిస్తున్నాం. మరో నెలపాటు ఇదేవిధంగా పనులు కొనసాగుతాయి. చేసిన పనులకు కూలీ చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశాం.
-నిఖిల, వికారాబాద్ జిల్లా కలెక్టర్