Punjab AAP | ఛండీగఢ్ : ఇప్పటికే చాలా రాష్ట్రల్లో బెదిరించి, భయపెట్టి, బామాలి అధికారాన్ని చేజిక్కించుకున్న కమలనాథులు.. పంజాబ్లో కూడా అదే తరహా కుట్రకు తెరలేపినట్లుగా తెలుస్తున్నది. పంజాబ్లో ఆపరేషన్ లోటస్ కింద హార్స్ ట్రేడింగ్కు పాల్పడినట్లు ఆధారాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు విజిలెన్స్ ఎదుట వాంగ్మూలం ఇవ్వగా.. తాజాగా మరో ఏడుగురు తమను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిన మాట నిజమే అని వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ నేతలపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర డీజీపీని కలిపి విజ్ఞప్తి చేశారు.
పంజాబ్లో ఆపరేషన్ లోటస్ కింద ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతున్నది. ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కమలం పార్టీ కుట్ర పన్నింది నిజమే అని రెండు రోజుల క్రితం ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు చెప్పగా.. తాజాగా మరో ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేల వాంగ్మూలాలను విజిలెన్స్ నమోదు చేసింది. ఆప్ ఎమ్మెల్యేలు శీతల్ అంగురల్, రామన్ అరోరా ఇద్దరే ఇప్పటివరకు విజిలెన్స్ ఎదుట తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. కాగా, తమకు డబ్బు ఆఫర్ చేసి బీజేపీలో చేరాలని బెదిరించారని ఆప్ ఎమ్మెల్యేలు డీజీపీ గౌరవ్ యాదవ్కు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లా ఆఫీసర్ తెలిపిన వివరాల మేరకు, గుర్తు తెలియని వ్యక్తులపై రాష్ట్ర క్రైమ్ సెల్లో కేసు నమోదు చేయబడింది. అనంతరం ప్రభుత్వం విచారణను విజిలెన్స్ బ్యూరోకు బదిలీ చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు విజిలెన్స్ బ్యూరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు ఎవరి పేరును వీరు బహిర్గతపర్చ లేదు. సోమవారం జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్, జలంధర్ సెంట్రల్ ఎమ్మెల్యే రామన్ అరోరా వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు జై కిషన్ రోడి (గర్హశంకర్), రూపిందర్ హ్యాపీ (బస్సీ పఠానా), బుధ్రామ్ (బుధ్లాడ), కుల్జీత్ సింగ్ రంధావా (దేరాబస్సీ ), మంజిత్ సింగ్ బిలాస్పూర్ (నహర్ సింగ్ వాలా), దినేష్ చద్దా (రూప్నగర్), మాస్టర్ జగ్సీర్ సింగ్ (భుచో మండి) స్టేట్మెంట్లను విజిలెన్స్ రికార్డ్ చేయనున్నది.
కాగా, ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లు మండిపడుతున్నాయి. పచ్చి అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాయి. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం వల్లనే తమపై అబాండాలు వేస్తున్నారని బీజీపీ పంజాబ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి డాక్టర్ సుభాష్ శర్మ దుయ్యబట్టారు.