శ్రీనగర్: బుధవారం మరణించిన కశ్మీర్ వేర్పాటువాద నేత, 92 ఏండ్ల సయ్యద్ అలీ షా గిలాని మృతదేహాంపై పాకిస్థాన్ జెండా ఉంచిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కాగా, గిలాని మృతదేహ్నాన్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి ఖననం చేశారని, ఆయనను చివరిసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని గిలానీ కుమారుడు నసీమ్ గీలాని ఆరోపించారు. అంతిమ సంస్కారాలకు తమ కుటుంబాన్ని పోలీసులు అనుమతించలేదని విమర్శించారు.
కాగా, వేర్పాటువాది గిలాని ఇంటిలోని వ్యక్తులు శ్రీనగర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్, ఇతర పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారని జమ్ముకశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. దేశ వ్యతిరేక నినాదాలు, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను అల్లర్లు, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. గిలానీ కుటుంబం, ఇతర వ్యక్తుల నుంచి ఇటువంటి వికృత ప్రవర్తనను తాము ఎన్నడూ ఊహించలేదన్నారు. గిలానీ బంధువులు ఆయన అంత్యక్రియల ప్రార్థనలలో పాల్గొన్నారని, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ రోడ్లోని హైదర్పోరాలో ఆయన నివాసానికి సమీపంలోని శ్మశాన వాటికలో గురువారం ఉదయం ఖననం చేసినట్లు చెప్పారు. అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలపై కేసులు నమోదు చేశామన్నారు.
మరోవైపు పాకిస్థాన్ అనుకూలవాది, కశ్మీర్ వేర్పాటువాది అయిన సయ్యద్ అలీ షా గిలాని సహజంగా మరణించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా జమ్ముకశ్మీర్లో గత మూడు రోజులుగా భారీగా ఆంక్షలు విధించారు. షాపులన్నీ మూతపడగా, ప్రజా రవాణా నిలిచిపోయింది. శుక్రవారం మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలను పోలీసులు అనుమతించలేదు. సామూహికంగా గుమిగూడటాన్ని నిషేధించారు. నిలిపివేసిన మొబైల్, ఇంటర్నెట్ సేవలను గురువారం రాత్రి పునరుద్ధరించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఇంకా నిలిపే ఉంచారు.