న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. ఇవాళ అంటే గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కేవలం 24 గంటల వ్యవధిలో కొత్తగా 6050 మందికి కోరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 వేల మార్క్ను దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై కరోనా మహమ్మారి కట్టడికి ఉపక్రమించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల మంత్రులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, ఆ మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర ఆంశాలపై వారితో చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్రం కొవిడ్పై నూతన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.