రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మంతనాలు జరుపుతున్న వీడియో కెమెరాకు చిక్కింది. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి రావటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘ఛత్తీస్గఢ్ను అవినీతికి డెన్’గా మార్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
‘ఎమ్మెల్యే రామ్కుమార్ ఎదుట ఉన్న నోట్ల కట్టలు ఎక్కడివి? అన్నది అధికార కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ము ప్రభుత్వానికి ఉందా?’ అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వీడియోలో కనిపించిన నోట్ల కట్టలకు తనకు సంబంధం లేదని తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని ఎమ్మెల్యే రామ్కుమార్ ఖండించారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ వీడియో రాజకీయంగా కలకలం రేపింది. గత ఐదేండ్లుగా కాంగ్రెస్ పాలనలో బొగ్గు, మద్యం, ఇసుక వ్యాపారంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోపిడికి పాల్పడుతున్నారని, మాఫియా రాజ్ నడుపుతున్నారన్నది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.