Viral Video : తమిళనాడులోని కోయంబత్తూర్లో ఇటీవల పదేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశంపై తాజాగా ప్రెస్మీట్లో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. అలాగే, మరో మహిళా మంత్రి స్పందించిన తీరుపై కూడా నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులు, ఇటు మంత్రి.. ఈ హత్యాచార ఘటనపై మాట్లాడేటప్పుడు నవ్వడమే ఇందుకు కారణం. పదేళ్ల బాలిక హత్యాచారానికి గురి కావడం చాలా తీవ్రమైన విషాధం.
ఈ అంశం గురించి మాట్లాడేందుకు పోలీసులు సోమవారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో సీనియర్ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆర్వీ రమ్య భారతి, కోయంబత్తూర్ రేంజ్ డీఐజీ పీ సామినాథన్, కోయంబత్తూర్ ఎస్పీ అల్లాటిపల్లి పవన్ కుమార్ పాల్గొన్నారు. అయితే, బాలిక హత్యాచార ఘటన అయిన సీరియస్ అంశాన్ని గురించి చెప్పేటప్పుడు వీరంతా చాలా సరదాగా, జోకులు వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసులు చెప్పే విషయానికి, వారి ప్రవర్తనకు సంబంధం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒక తీవ్రమైన నేరాన్ని గురించి ప్రస్తావించేటప్పుడు పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఇదే అంశంపై తమిళనాడు మంత్రి ఎస్ కీర్తన కూడా మీడియాతో మాట్లాడారు. బాలిక హత్యాచారంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేసమయంలో కీర్తన కూడా నవ్వుతూ బదులిచ్చారు. దీంతో ఆమెపై కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాలిక హత్యాచారానికి గురైతే.. బాధ్యత కలిగిన ఒక మహిళా మంత్రి ఇలా నవ్వుతూ స్పందించడం ఏంటని విమర్శిస్తున్నారు. విజయ్ ప్రభుత్వానికి ఈ అంశంపై సున్నితమైన భావన లేదని నెటిజన్లు అంటున్నారు. ఈ అంశం ఇటు పోలీస్ యంత్రాగానికి, అటు విజయ్ ప్రభుత్వానికి ఇబ్బందిపెట్టేలా మారింది.