చెన్నై, ఫిబ్రవరి 4: చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ మరణం నుంచి ఇంకా తేరుకోకముందే ప్రముఖ గాయని వాణీ జయరాం(77) కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియులను అలరించారు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డును ఆమెకు ప్రకటించారు. చెన్నైలోని ఓ అపార్టుమెంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఆమె శనివారం విగతజీవిగా కన్పించారు. ఆమె నుదుటిపై గాయం ఉందని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. బహుశా కిందపడి, గాయం కారణంగా మరణించి ఉండవచ్చని చెప్పారు. భర్త మరణం తర్వాత వాణీ జయరాం ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమెకు సంతానం లేరు. తమిళనాడులోని వెల్లూరులో జన్మించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సహా పలు భాషల్లో గీతాలను ఆలపించారు. వాణీ జయరాం మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
ఎన్నో ఆణిముత్యాలు..
50 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఆణిముత్యాలు ఆమె స్వరం నుంచి జాలువారాయి. హిందీ చిత్రం గుడ్డి (1971)లో బొల్ రే, తమిళంలోని అపూర్వ రాగంగళ్ (1975)లోని ఏజు స్వరంగలుక్కుల్, దీర్ఘ సుమంగళి (1974)లోని మల్లిగై ఎన్ మన్నన్ మయంగుంతో పాటు తెలుగులో పలు పాటలు ఆమె సినీ నేపథ్య జీవితంలో మైలురాళ్లుగా మిగిలాయి. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు.
సహజ మరణమేనా?
వాణీ జయరాం మృతిపై ఆమె బంధువులను పోలీసులు ఆరా తీశారు. పనిమనిషి తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చిందని, వారు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. పనిమనిషి మాట్లాడుతూ తాను పదేండ్ల నుంచి వాణీ జయరాం వద్ద పనిచేస్తున్నానని, ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు.