ముంబై: కరోనా మహమ్మారి బారినపడి రెండు వారాలకుపైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేష్కర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నది. ఆమె ఆరోగ్యం కొద్దికొద్దిగా మెరుగుపడుతున్నదని వైద్యులు తెలిపారు. దాంతో రెండు రోజుల క్రితమే ఆమెకు వెంటిలేటర్ తొలగించినట్లు చెప్పారు.
ఆమె మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉండాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. కరోనాకు తోడు ఆమెకు అంతకుమునుపే న్యుమోనియా కూడా ఉండటంతో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందిస్తున్నారు.
కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో లతా మంగేష్కర్ను కుటుంబసభ్యులు ఈ నెల 11న బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమెను ఐసీయూలోనే వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లతా మంగేష్కర్ హిందీ, మరాఠీ, బెంగాలీతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో పాటలు పాడారు. నేపథ్య గాయనిగా సీనిరంగంలో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. భారత రత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతోపాటు ఇంకా ఎన్నో పురస్కారాలను ఆమె స్వీకరించారు.