న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సీనియర్ జర్నలిస్టు వినోద్ దువా (67) శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో ఢిల్లీలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన దాని నుంచి కోలుకున్నా అనారోగ్యంగానే ఉన్నారు. దూరదర్శన్తో కెరీర్ ప్రారంభించిన వినోద్ దువా.. తరువాత పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. జర్నలిజంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.